ప్రజారోగ్య పరిరక్షణకు కేసీఆర్ కృషి
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి 49 మంది ఆశకార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్టు చెప్పారు. అందుకు అనుగుణంగా ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చబోతున్నట్టు స్పష్టం చేశారు. ఏఎన్ఎం కేంద్రంలో స్టాఫ్నర్సు, వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు సేవలందించడం అదృష్టంగా భావించాలని సూచించారు. అంబులెన్స్ల ద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన చోట కొత్త వాహనాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని హరీశ్రావు పేర్కొన్నారు.
జేపీ తండాలో వంద శాతం వ్యాక్సినేషన్.. అభినందించిన మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్త తెలంగాణ): కరోనా వ్యాక్సినేషన్లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని జేపీ తండా వంద శాతం పూర్తి చేసింది. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. జేపీతండాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం పట్ల మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. కృషిచేసిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా అధికారులు కృషిచేయాలని, జేపీ తండాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం తగదని, సమీపంలోని ప్రభుత్వ కేంద్రాల వద్దకు వెళ్లి నిర్దేశించిన గడువు ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.