ప్రయాగరాజ్, సెప్టెంబర్ 27: ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన ప్రాంతంలో విద్యార్థులు ఐదు అడుగుల పెద్ద గుంత తవ్వారు. ఫీజుల పెంపును ఉపసంహరించుకోకపోతే ఈ గోతిలో తమను తాము భూసమాధి చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఆ గుంతలోకి దిగి నిరసన చేపట్టారు. దీంతో శతవిధాలుగా ప్రయత్నించి వారిని బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. పరిస్థితులను అదుపు చేసేందుకు మరిన్ని బలగాలను మోహరించారు.
ఫీజులను దాదాపు మూడు రెట్లు పెంచారని, ఇది తమకు పెనుభారంగా మారుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా యూనివర్సిటీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ్ సింగ్ భదౌరియా అనే విద్యార్థి మాట్లాడుతూ అధిక ఫీజులకు వ్యతిరేక పోరాటంలో తమ ప్రాణాలు అర్పించేందుకు అయినా సిద్ధంగా ఉన్నామన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నిరసనలను లెక్కలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. అధిక ఫీజులు పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని, వెంటనే ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.