చండీగఢ్ : హర్యానాలోని ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటర్ రీజియన్) పరిధిలోని 14 జిల్లాల్లో పటాకులపై ప్రభుత్వం నిషేధం విధించింది. పటాకులు అమ్మకాలు, విక్రయాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, కేవలం గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. వాటిని కాల్చేందుకు కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమయాన్ని నిర్దేశించింది. దీపావళి పండుగ రోజున కేవలం రెండు గంటలను మాత్రమే గ్రీన్ క్రాకర్స్ను కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా పోలీసు బృందాలు తనిఖీలు చేపడుతాయని హెచ్చరించింది. శీతాకాలం, కరోనా మహమ్మారి నేపథ్యంలో పటాకులు పేల్చడం ద్వారా వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో బ్యాన్ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీపావళి పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు, ఛట్ పూజ సందర్భంగా ఉదయం 6-8 గంటల వరకు, క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా రాత్రి 11.55-12.30 పటాకులు పేల్చేందుకు అనుమతి ఇచ్చింది.
భివానీ చర్కీ, దాద్రీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఝజ్జర్, జింద్, కర్నాల్, మహేంద్రగఢ్, నూహ్, పల్వల్, పానిపట్, రోహ్తక్, రేవారి, సోనెపట్లో నిషేధం అమలులో ఉండనున్నది. మరో వైపు పంజాబ్లోనూ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. పంజాబ్లో దీపావళి, గురుపురాబ్ రోజుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి ఉన్నది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం సైతం బాణాసంచా వినియోగం, విక్రయాలపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.