ముషీరాబాద్ : నష్టాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ని గాడీలో పెట్టెందుకు ఆర్టీసీ ఎండీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. తను పనిచేస్తున్న సంస్థలో ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించడం సజ్జనార్కు అలవాటే. అందులో భాగంగా ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆయన చర్యలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ఆయన ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
బాధ్యతల స్వీకరించిన వెంటనే సజ్జనార్ ఇటీవల ఎంజీబీఎస్ను తనిఖీ చేశారు. అలాగే గ్రేటర్ జోన్ లో మరన్ని ఆకస్మిక తనిఖీలు చేపట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. నష్టాలు తగ్గించుకోవడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
బస్సుల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ, ఇతర సమస్యలపై సూచనలు తీసుకుని, సమస్యలకు పరిష్కారం చూపనున్నా రు. ఇందుకోసం కోఠి- 99592 26160, సికింద్రాబాద్ -83339 04531 నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, శివారు ప్రాంతాలతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ బస్సులు నడపనున్నారు. గ్రేటర్ లో కీలకమైన జేబీఎస్ , ఎంజీబీఎస్లలో ఖాళీగా ఉన్న దుకాణాలపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు.
అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పుష్పక్ ఏసీ బస్సుల టైం టేబుల్ను ఫోన్లో తెలిపే ఏర్పాట్లు చేస్తున్నారు. 8385047693, 7382925971 నంబర్లకు ఫోన్ చేసే ఏ స్టాప్ కు ఏ సమయంలో బస్సులు వస్తాయో తెలుసుకునే వీలుంటుందని ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తున్నారు.