న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో ప్రస్తుతమున్న వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు పూర్తి స్థాయి సామర్థ్యంతో సుమారు 9.5 రోజుల డిమాండ్ను మాత్రమే తీర్చగలవని వెల్లడైంది. ప్రభుత్వ గణాంకాలు, ఇండియా టుడే దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ప్రకారం.. వ్యూహాత్మక చమురు నిల్వలు పూర్తి సామర్థ్యం కంటే తక్కువగానే ఉన్నట్టు తేలింది. సోమవారం రాజ్యసభలో అందించిన డాటా ప్రకారం మొత్తం నిల్వ సామర్థ్యం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, అందులో 64 శాతం, అనగా 3.372 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు మాత్రమే భారత్ వద్ద నిల్వ ఉంది.
ఈ నిల్వలు దేశంలోని పూర్తి స్థాయి చమురు అవసరాలను 9.5 రోజులు మాత్రమే తీర్చగలవని వెల్లడైంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్ఠంభనతో వాణిజ్య నౌకల రవాణా నిలిచిపోవడంతో దాని ప్రభావం భారత్ సహా పలు దేశాలపై పడింది. ముఖ్యంగా చమురు అవసరాలకు 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడ్డ భారత్కు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది. దేశంలో అత్యవసర పరిస్థితుల కోసం పెద్దమొత్తంలో చమురు నిల్వ ఉంచే ప్రణాళికను వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ప్రణాళిక (ఎస్పీఆర్) అంటారు. 2004లో ఎస్పీఆర్ను ప్రారంభించగా, దీని కింద దక్షిణ భారత దేశంలోని మూడు నగరాల్లో భారీగా ముడి చమురును నిల్వ చేస్తుంటారు.