ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు సంతోషంగా విద్యనేర్చుకొనే వాతావరణాన్ని కల్పించేందుకు విద్యాశాఖ వేగంగా అడుగులు వేస్తున్నది. కథలు, పాటలు, నృత్యాలు, ఆటలు, బొమ్మలతో పాఠాలు చెప్పే విధానంపై ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నది. ‘హరివిల్లు’ పేరుతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆనందమయ విద్యాప్రణాళికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే మహబూబాబాద్, వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లో పరివర్తన్, ఢిల్లీలో హ్యాపీనెస్ క్లాస్, ఆంధ్రప్రదేశ్లో ఆనంద వేదిక పేరుతో జాయ్ఫుల్ లెర్నింగ్ను అమలుచేస్తున్నారు. ఇదే తరహాలో మనరాష్ట్రంలో హరివిల్లు పేరుతో ప్రవేశపెడుతున్నారు. ఉపాధ్యాయులకు బోధనాప్రణాళిక, బోధనా విధానాలపై మంగళవారం నుంచి ఐదురోజులు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 18వేలు ఉన్నాయి. వీటిల్లో 68 వేలమంది టీచర్లు పనిచేస్తున్నారు.
వీరందరికీ శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక మాడ్యూల్స్ తయారుచేశారు. 1-2 తరగతికి లెవెల్-1, 3-5 తరగతుల వారికి లెవెల్-2 పేరుతో మాడ్యూల్స్ అభివృద్ధిచేశారు. దీనికి దాల్మియా గ్రూప్కు చెందిన బ్లూ ఆర్బ్ ఎన్జీవో సహకారం అందించింది. ఇప్పటికే 594 మండలాల నుంచి ఇద్దరు చొప్పున 1,200 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరంతా మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.