హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రైతుల పట్ల ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి పండిస్తున్నట్టు ఆధారాలు లభిస్తే వారికి రైతు బంధును రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించటంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో 131 మంది రైతులు గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి, వారందరికీ రైతుబంధును రద్దు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. వీరిలో ఇప్పటికే 109 మందికి రైతుబంధును రద్దు చేసినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో కొందరు రైతులు సాధారణ పంటల మాటున గంజాయి సాగుచేస్తున్నట్టు గుర్తించారు. రైతుల ఇండ్లల్లో గంజాయి విత్తనాలు, గంజాయి పట్టుబడటంతో ఎక్సైజ్శాఖ అధికారులు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది.