Stock market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. వరుసగా మూడో రోజు లాభంతో ఈ వారం ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 261 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు లాభపడ్డాయి. మార్కెట్లో అస్థిరత, లాభాల స్వీకరణ కొనసాగినప్పటికీ చివరకు ట్రేడింగ్ లాభాల్లో ముగియడం విశేషం. ఉదయం 9.15 గంటలకు మార్కెట్ లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్ల లాభంతో 77,950 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 24,300 వద్ద ప్రారంభమైంది.
చివరకు సెన్సెక్స్ 261 పాయింట్ల లాభంతో 77,763 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 24,270 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. ఈ సంస్థ షేర్లు దాదాపు 5.80% దూసుకెళ్లాయి. టెక్ మహీంద్రా 1.81%, బజాజ్ ఫిన్సర్వ్ 2.13%, భారతీ ఎయిర్టెల్ 1.81%, సన్ఫార్మా 1.77% లాభపడ్డాయి. నిఫ్టీ రియాల్టీ షేర్లు, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 1.56% నష్టపోయింది. ఎస్బీఐ 1.13%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.1%, లార్సన్ అండ్ టర్బో 0.83% నష్టపోయాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.22గా ఉంది. బంగారం ఔన్స్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 4,179 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా లాభాల్లో ముగిశాయి. దక్షిణ కొరియా కోస్పి 1.4 శాతం, జపాన్ నిక్కీ 0.3 శాతం లాభపడ్డాయి.