న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రాజకీయ నాయకులతో సత్సంబంధాలు, విధి నిర్వహణలో రాజీతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పోలీసులను ప్రజలు మళ్లీ నమ్మాలంటే వెంటనే చేయాల్సిన పని ‘పొలిటికల్ కనెక్షన్లను తగ్గించుకోవడమే’ అని పేర్కొన్నారు. రాష్ర్టాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత తమపై వేధింపులు పెరుగుతున్నాయంటూ పలువురు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న విషయాన్ని జస్టిస్ రమణ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిష్పక్షపాతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పోలీసులు పనిచేస్తే ఎవరు అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ 19వ స్మారకోపన్యాస కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు’ అనే అంశంపై ప్రసంగించారు. అవినీతి ఆరోపణలు, పొలిటికల్ కనెక్షన్లలతో పోలీసు వ్యవస్థపై గౌరవం పోతున్నదని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని దర్యాప్తు సంస్థలను అన్నింటినీ పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ప్రసంగంలో సీబీఐ గురించి జస్టిస్ రమణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. న్యాయం కోసం బాధితులు సీబీఐ వైపే చూసేవారు. కాలక్రమంలో అన్ని దర్యాప్తు సంస్థల్లాగే సీబీఐ కూడా విశ్వసనీయత కోల్పోయింది’ అన్నారు. దర్యాప్తు సంస్థ ఏదైనా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడాలని, అందుకోసం పోలీసుల శిక్షణ తీరులో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు.