రంగారెడ్డి, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ): దళితబంధులాంటి పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించేది లేకుండా దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రూ.10 లక్షలను అందజేస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా శుక్రవారం సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్లో 50 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపారాలను మాత్రమే ఎంచుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించామన్నారు.
అంతేకాకుండా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. మరోవైపు వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడి ఏదైనా అనుకొనిది జరిగితే ఆదుకునేందుకుగాను ప్రత్యేకంగా రక్షణనిధిని ఏర్పాటు చేశారని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా దశల వారీగా నియోజకవర్గానికి 2 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలె యాదయ్య, జైపాల్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, యెగ్గే మల్లేషం, దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.