న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రాష్ట్రాలు సొంతంగా టీకాలు కొనడం సాధ్యం కాదా? కేంద్రం ద్వారా రావాల్సిందేనా? కేంద్రం అవసరమైనన్ని టీకాలు సరఫరా చేయలేకపోతున్నది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి టీకాలు కొనాలని తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తున్నాయి. కానీ బీహార్ మాత్రం ఈ మార్గంలో టీకాల కోసం ప్రయత్నించేది చేదని తేల్చి చెప్పింది. “రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు జారీచేస్తే ఫలితాలేమిటో చూశారు కదా” అని బీహార్ ఆరోగ్యమంత్రి మంగళ్ పాండే మీడియాతో అన్నారు. పంజాబ్ ప్రభుత్వం టీకాల కోసం స్పుత్నిక్-5, ఫిజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను సంప్రదించింది. కేవలం మోడర్నా నుంచి మాత్రమే స్పందన వచ్చింది. అదీ సరఫరా చేయలేమని. కేంద్ర ప్రభుత్వంతో తప్ప రాష్ట్ర ప్రభుత్వాలతో బిజినెస్ చేయడం తమ విధానం కాదని మోడర్నా, ఫిజర్ మీడియా ద్వారా ప్రకటించాయి కూడా. బీజేపీ-జనతాదళ్ కూటమి అధికారంలో ఉన్న బీహార్ గ్లోబల్ టెండర్లకు పోవద్దని తీర్మానించుకుంది. తాజాగా మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కారు కూడా గ్లోబల్ టెండర్లకు పోవద్దని నిర్ణయించడం గమనార్హం. ఈ సమస్య.లను దృష్టిలో ఉంచుకునే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రమే చొరవ తీసుకుని టీకాలు దిగుమతి చేసుకోవాలని సూచించారు. దేసీయ ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా టీకాలు కొనుగోలు చేయొచ్చని కేంద్రం ప్రకటించింది. కానీ తయారీదీరులు కేంద్రం ఆర్డర్లకే ప్రాధాన్యం ఇస్తామని, పైగా తమ ఉత్పత్తి సామర్థ్యం దేశ అవసరాలకు సరిపోదని తేల్చిచెప్పాయి. దీంతో రాష్ట్రాల పరిస్థితి అయోమయంగా తయారైంది.