హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఈ నెల 31న మహిళా రైతు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, కార్యదర్శి టీ సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంస్థ కార్యాలయంలో మహిళా రైతు రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్టుబడి సాయం అందక మహిళా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కౌలు రైతులుగా ఉన్న మహిళలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
పాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, కోళ్ల పెంపకంలో కీలకంగా ఉన్న మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల పని భారాన్ని తగ్గించే యంత్రాల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాదరావు, పెసరగాయల జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.