హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫిదా అయ్యారు. ఇక్కడి ప్రజలు, న్యాయరంగ ప్రముఖులు తన పట్ల చూపుతున్న ఆదరణ ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదన్నారు. ఈ సంతోషాన్ని వ్యక్తీకరించేందుకు మాటలు చాలడంలేదన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆహ్వానం మేరకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సాయంత్రం సతీసమేతంగా బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా సీజేఐ దంపతులకు జస్టిస్ హిమా కోహ్లీ దంపతులు విందు ఇచ్చారు. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ విందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు జస్టిస్ సయ్యద్ షా మహ్మద్ ఖాద్రీ, జస్టిస్ సుదర్శన్రెడ్డి, జస్టిస్ వెంకట్రామిరెడ్డి, జస్టిస్ ఎం జగన్నాథరావు, జస్టిస్ జీవన్రెడ్డి తదితరులు హాజరయ్యారు. దాదాపు 55 ఏండ్ల తర్వాత తెలుగు బిడ్డ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అధిపతి కావడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1982లో ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా ప్రారంభించి ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తనకు హైకోర్టు శతవసంత వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 పెంచినట్లు చెప్పారు. తన పట్ల ఎంతో గౌరవంతో ఈ విందుకు విచ్చేసిన న్యాయమూర్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు జడ్జీల సంఖ్యను 75 శాతం పెంచిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, ఇతర న్యాయమూర్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంతకాలతో కూడిన హైకోర్టు క్యాలెండర్ను కూడా బహూకరించారు. అనంతరం అందరూ కలిసి సీజేఐతో గ్రూప్ ఫొటోలు దిగారు. హైకోర్టు సీజే, ఏపీ, తెలంగాణ మహిళా న్యాయమూర్తులు జస్టిస్ లలిత, జస్టిస్ గండికోట శ్రీదేవి సీజేఐతో ఫొటోలు దిగారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు, తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో విడిగా ఫొటో దిగారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రాజ్భవన్లో జస్టిస్ రమణను శనివారం సీఎం కేసీఆర్ కలిసి యాదాద్రిని సందర్శించాలని కోరటంతో ఆయన అంగీకరించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి, బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు ప్రముఖులు కూడా శనివారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు.