సికింద్రాబాద్,జనవరి 6: కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం ఇక్కడ అమలుకు నోచుకోవు. ఒక్క పథకమైనా కంటోన్మెంట్ పరిధిలో ప్రవేశపెట్టిన దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కానీ ఇక్కడి కాషాయపు నేతలు మాత్రం అంతా కేంద్రం చలువే అంటూ ఊకదంపుడు ఉపాన్యాసాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు.
కనీసం కేంద్రంలో అమలు అవుతున్న ఒక్క పథకం పేరైనా ఇక్కడి కమలం నేతలకు తెలియకపోవడం గమనార్హం. పథకాలు అమలు చేయలేక చతికలపడుతున్న నేతలు…మాటలతో మాయ లు చేస్తూ బోర్డు పరిధిలోని ప్రజలను మభ్యపెట్టడంలో ముందుంటున్నారు. ఇటీవల బీజేపీ నేతలకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సూటిగా సవాల్ విసిరారు. దమ్ముంటే కంటోన్మెంట్లో ఒక్క కేంద్ర పథకమైనా అమలు అవుతుందా అని ప్రశ్నించారు.
సుమారు ఇరవై రోజులు అవుతున్నా కమలం నేతల నుంచి సమాధానం రాలేదు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్లో ప్రవేశపెట్టిన పథకాల వివరాలను మీడియాకు వివరించడం జరిగింది. సుమా రు 21సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతున్నాయో కంటోన్మెంట్లో సైతం అదే మాదిరిగా అమలు అవుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఆయా వార్డుల్లో బ్యానర్లను ఏర్పాటు చేసే అంశంపై కసరత్తులు ప్రారంభించారు.
అబద్దాలతోనే కాలం వెళ్లదీస్తున్న కాషాయం
కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు ఏమి చెప్పాలో కూడా తెలియని అయోమయ స్థితిలో కాషాయం నేతలు పడ్డారు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు ఆడుతూ కేంద్రమే అన్ని పథకాలు తెస్తుందని ఇటీవల కాలంలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న ఓ నేత జనాలకు అబద్దాలు చెబుతున్నారు.
కేంద్ర పరిధిలో ఉండే కంటోన్మెంట్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ పథకాలే శ్రీరామరక్షగా నిలుస్తున్నా, కేంద్ర పథకాలపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు.ఎవరైనా స్థానికులు మీ పథకాలు ఎక్కడా అని ప్రశ్నిస్తే మాత్రం చల్లగా అక్కడి నుంచి జారుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మరోవైపు కంటోన్మెంట్ సివిలియన్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్రంతో పాటు ఇక్కడి ప్రాంత ప్రజలు కోరుకుంటున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న నేతలపై రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర పథకాలతోనే మునుగడ
జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రాష్ట్ర సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధానంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, ఆసరా పెన్షన్లు, వితంతు పెన్షన్లు, డబుల్బెడ్రూం ఇండ్లతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా నిత్యం కళ్లబొల్లి మాటలతో జనాలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుండటంపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
అదే విధంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉచిత తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇన్ని పథకాలు రాష్ట్ర సర్కారు అమలు చేస్తుంటే ఒక్క పథకమైనా అమలు చేయకుండా కేంద్రం చోద్యం చూస్తుంటే ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం నిసిగ్గుగా జనాల్లో తిరగడం గమనార్హం. ఇదిలా ఉండగా అభివృద్ధి చేస్తామంటే కూడా కనీసం బోర్డు పరిధిలోని మైదానాలను కూడా ఇవ్వకుండా క్రీడాకారుల భవితపై నీళ్లు చల్లుతున్న బోర్డు అధికారులు పునరాలోచించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు రక్షణ శాఖ రోడ్డు విస్తరణతో పాటు స్కైవేలకు భూములు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. చూడాలి మరి ఇప్పటికైనా కేంద్ర రక్షణ శాఖ కనికరిస్తుందో లేక చోద్యమే చూస్తుందో వేచి చూడాల్సిందే…!