హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలను నిర్వహించాలనే అంశాన్ని విద్యాశాఖ అధికారులు పక్కనబెట్టారు. ఒకే పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. వచ్చే ఏడాది నిర్వహించే వార్షిక పరీక్షలే ఫైనల్ పరీక్షలు కానున్నాయి. విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్లు (ఎఫ్ఏ), రెండు సమ్మెటివ్ అసెస్మెంట్లను నిర్వహించనుండటంతో మధ్యలో మరో పరీక్షపెట్టడం అవసరం లేదన్నారు. టెన్త్ విద్యార్థులకు ఏడాదిలో రెండు పరీక్షలను నిర్వహించాలని ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గతంలో నిర్ణయించింది. సీబీఎస్ఈ విద్యార్థులకు ఈ నెల 16 నుంచి టర్మ్ -1 ఎగ్జామ్స్ సైతం ప్రారంభమయ్యాయి. ఇదే తరహాలో తెలంగాణలోను రెండు పరీక్షలను నిర్వహించాలన్న అంశాన్ని అధికారులు పరిశీలించారు. ఇందుకు ఉన్నతాధికారులతో కమిటీని సైతం ఏర్పాటుచేశారు. పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ.. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలను నిర్వహిస్తుండటంతో టర్మ్ -1 ఎగ్జామ్స్ నిర్వహించే అంశాన్ని ఉపసంహరించుకున్నది.
రాష్ట్రంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాతే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ చివరివారంలో ప్రారంభించి, మే మొదటివారంలో ముగించాలని ఇంటర్బోర్డు యోచిస్తున్నది. ఇంటర్ పరీక్షలు ముగిసిన మరుసటి రోజునుంచే పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు యోచిస్తున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేస్తామని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు.