తిరుమల : అక్టోబరు 15 నుంచి యూకే, యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ కల్యాణాలు అక్టోబర్ 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టడంలో భాగంగా శ్రీనివాస కల్యాణాలు చేపడుతున్నామని చెప్పారు. అన్నయ్య భవన్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దగ్గర చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీనివాస కల్యాణాలు, వైభవోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది జూన్, జులైలో విదేశాల్లోని తెలుగు సంఘాలు, ఏపీఎన్నార్ టీఎస్ సహకారంతో అమెరికాలోని 9 నగరాల్లో స్వామి వారి కల్యాణాలు జరిపినట్లు చెప్పారు. అక్టోబర్ 15 నుంచి యూకే, యూరప్ దేశాల్లోని తెలుగు సంఘాల సహకారంతో అక్కడి భక్తుల కోరిక మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్టోబరు 15న యూకేలోని బాసింగ్ స్టేక్, 16న మాంచెస్టర్, 22న నార్తన్ ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్, 23న ఐర్లాండ్లోని డబ్లిన్ లో కల్యాణాలు జరుగనున్నాయి. అక్టోబరు 29న ఈయూ లోని జురిచ్ స్విట్జర్లాండ్, 30వ తేదీన నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్. నవంబరు 5న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, 6న పారిస్ ఫ్రాన్స్, 12న లండన్, 13న స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో స్వామివారి కల్యాణాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు రాంభూపాల్ రెడ్డి , నందకుమార్ , ఏపీఎన్ ఆర్టీఎస్ అధ్యక్ష్యులు మేడపాటి వెంకట్, యూకే తెలుగు అసోసియేషన్ అధ్యక్ష్యుడు కిల్లి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.