హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకాలతో మెరిశారు. ఇండోర్ వేదికగా జరిగిన టోర్నీలో గురువారం మహిళల సెమీఫైనల్లో టాప్సీడ్ శ్రీజ 3-4(11-8, 8-11, 11-8, 12-10, 7-11, 3-11, 4-11) తేడాతో దివ్య చితాల(మహారాష్ట్ర) చేతిలో ఓటమిపాలైంది. నాలుగో సెట్ వరకు ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడిన శ్రీజ..ఆఖరి మూడు సెట్లలో పట్టుసడలించి మూల్యం చెల్లించుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో శ్రీజ 4-0(11-6, 11-4, 11-6, 12-10) తేడాతో అనూష(మధ్యప్రదేశ్)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్నేహిత్ 1-4(11-8, 8-11, 8-11, 7-11, 8-11)తేడాతో మూడో సీడ్ హర్మీత్దేశాయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ సీజన్లో తొలిసారి సెమీస్ చేరిన స్నేహిత్..క్వార్టర్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ మానవ్ థక్కర్పై 4-3తో గెలిచి ఆకట్టుకున్నాడు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో శ్రీజ, స్నేహిత్తో పాటు కోచ్ సోమ్నాథ్ ఘోష్, ఫిట్నెస్ కోచ్ హిరాక్ బాగ్చీ పాల్గొన్నారు.