సిద్దిపేట రూరల్, మే 24: మేలైన విత్తనాలతో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి శ్రీదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం విత్తన మేళా నిర్వహించారు. శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి జరిగింది. వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాన శాస్త్రవేత్త, కళాశాల అధిపతి శ్రీదేవి మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యత, దిగబడులపై రైతులకు వివరించారు. తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం తయారు చేసిన మేలైన విత్తనాల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. వరి విత్తనాలు దొడ్డు రకం జేజీఎల్-24423 (జగిత్యాల వరి-1), కేఎన్ఎం-118 (కునారం సన్నా లు), సన్న రకాలు కేఎన్ఎం1638(కునారం వరి-2), డబ్ల్యూజీఎల్-44(సిద్ది), డబ్ల్యూజిల్-962 (వరంగల్ వరి-2), కందిలో డబ్ల్యూఆర్ జీఈ-97(వరంగల్ కంది-1), డబ్ల్యూఆర్ జీఈ-93 (తెలంగాణ కంది-1), డబ్ల్యూఆర్ జీఈ-255 (వరంగల్ కంది-2) నాణ్యమైన విత్తనాల గురించి రైతులు ఆసక్తిగా తెలుసుకున్నారు.
విత్తనాలు వాడేటప్పుడు నేల పరీక్షలు చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. వ్యవసాయ శాఖ సిద్దిపేట జిల్లా అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులు వాడాలని, విత్తనం లభించకుంటే పెసర కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు. బీజేఆర్ అగ్రికల్చర్ సిరిసిల్ల కళాశాల అసోసియేట్ డీన్ జి.శ్రీదేవి మాట్లాడుతూ రైతులు వివిధ పంటల్లో వాడుతున్న పురుగుమందులతో మానవ, పర్యావరణ వ్యవస్థపై ప్రభావాన్ని వివరించారు. మోతాదుకు మించి పురుగు మందులు వాడకంతో పర్యావరణంతోపాటు నేల కలుషితం అవుతుందన్నారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ విజయ్ మాట్లాడుతూ వేసవి లోతు, దుక్కులు చేసుకోవాలని తద్వారా వరిలో మోగిపురుగు నివారణ సాధ్యమన్నారు. విత్తన మేళాలో ఆదర్శ రైతులు రాజిరెడ్డి(వెదసాగు), రవీందర్(డ్రంసీడర్), కవిత(అధిక సాంధ్రత పత్తి తర్వాత పంట మొదల్లను దున్ని పొద్దు తిరుగుడు సాగు చేయడం) అనే అంశాల్లో ప్రతిభచూపిన వీరిని శాస్త్రవేత్తలు సన్మానించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నట్లు శాస్త్రవేత్త శ్రీదేవి తెలిపారు. మేళాలో తోర్నాల వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు ఉమారాణి, సరిత, శ్వేత, శ్రీజయ, రమాదేవి, పల్లవి, రాజా, తోర్నాల, బుస్సాపూర్, ఘనపూర్, ముండ్రాయి, పోతారం, చిట్టాపూర్, ఇబ్రహీంపూర్, చేర్యాల నుంచి 300మంది రైతులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ పరిశోధన స్థానం విద్యార్థులు పాల్గొన్నారు.