తిరుమల : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలను ఏకాంతంగా సాగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే ఊంజల్సేవ నిర్వహిస్తారు. 15న ఆలయంలో గజ వాహనంపై అమ్మవారిని వేంచేపు చేసి ఆస్థానం చేపడతారు. నవరాత్రి ఉత్సవాల కారణంగా అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.