కొలంబో, ఏప్రిల్ 3: శ్రీలంకలో ప్రజాగ్రహానికి కర్ఫ్యూ తట్టుకోలేకపోయింది. ఎమర్జెన్సీతోపాటు 36 గంటల కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. కాండీలో రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకు రావడంతో అప్రమత్తమైన బలగాలు వారిని నిలువరించడానికి ప్రయత్నించాయి. వారిపైకి జల ఫిరంగులను, బాష్పవాయువును ప్రయోగించాయి. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్ఫ్యూని ఉల్లంఘించినందుకు దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్బుక్, వాట్సాప్లాంటి సోషల్ మీడియాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఓవైపు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండటంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ప్రధాని రాజీనామా చేయరు
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయబోరని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది.