బాసర, జనవరి 24 : దక్షిణ భారతదేశంలో అత్యంత మహిమాన్విత క్షేత్రం బాసర జ్ఙాన సరస్వతీ నిలయం. మనశ్శాంతి ప్రసాదించే ప్రాంతంగా ఈ ఆలయం పేరొందింది. భారత యుద్ధాన్ని చూసి చలించిన వ్యాస మహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడానికి వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి సరస్వతీ అమ్మవారు విశేష పూజలందుకుంటున్నారు. బాసర ఆలయం దినదిన ప్రవర్థమానం చెందుతూ అఖండ కీర్తితో అలరారుతోంది. నిత్యం వేలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వందలాది అక్షర శ్రీకార పూజలు జరుగుతుంటాయి. రేపు (26వ తేదీ) వసంత పంచమి సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
అమ్మవారు కొలువైంది ఇలా..
వ్యాస మహర్షి బ్రహ్మండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిన అవసరం ఏర్పడింది. శక్తిని వర్ణించాలంటే మరింత తపోశక్తితో పాటు ఎలాంటి అంతరాయం లేని మహిమ గల ప్రశాంత వాతావరణం అవసరం. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిగిరి బాసర (జాహ్నవ తీరం) చేరుకున్నారు. ఇదీ గోదావరి నాభీ స్థానం. మహారాష్ట్రలోని నాందెడ్ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదారి నాభీ స్థానం అంటారు. బ్రహ్మేశ్వరం లోకేశ్వరం మండల కన్కాపూర్లో ఉంది. ఇది అప్పటికే పుణ్య స్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడానికి ఆగాడు. గోదావరి తీరంలో ధ్యానంలో ఉన్న ఆయనకు ఏదో శక్తి నీడలా కనిపించి వెను వెంటే మాయమైంది. దీంతో ఆ రూపం ఎవరిదా అని తన దివ్య దృష్టితో చూడగా.. జ్ఙాన సరస్వతీ అమ్మవారినని చెప్పింది. ప్రతీ రోజు గోదావరిలో ధ్యానం చేసి పిడికెడు ఇసుకను నచ్చిన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుకతో తన పూర్తి రూపం తయారవుతుందని, అనంతరం జ్ఙాన సరస్వతీగా అందరికీ దర్శనమిస్తానని అమ్మవారు తెలిపిందని పురాణాల్లో ఉంది.
వ్యాసుడు గోదావరి తీరాన కొంత దూరంలో ఉన్న పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించారు. అమ్మవారు చెప్పినట్లు ఇసుకను తీసుకవచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించారు. ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత అమ్మవారి రూపం పూర్తి కావడం, ఆమె జ్ఙాన సరస్వతీగా కొలువుదీరినట్లు పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కోసం సరస్వతీ దేవి ఆయనకు జ్ఙాన బీజాన్నీ ఉపదేశించింది. అప్పటి నుంచి బాసర.. జ్ఙానానికి పుట్టుకగా వెలుగొందుతోంది. భారతదేశంలోని కశ్మీర్, కన్యాకుమారిలలో సరస్వతీ ఆలయాలు ఉన్నా.. చదువుల తల్లి బాసరలోనే ఉందని పెద్దలు చెబుతుంటారు. అయితే సరస్వతీ దేవినే ప్రతిష్ఠించడం సబబు కాదని అమ్మవారికి తోడుగా మహంకాళి, మహాలక్ష్మీలను ప్రతిష్ఠించారు. ముగ్గురు మాతలు పక్కపక్కనే ఉండడం విశేషం.
ఆలయ నిర్మాణం..
బాసరలోని సరస్వతీ దేవి, ఇతర ఆలయాలను చోళ రాజులే నిర్మించినట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. చోళ రాజుల కాలంలో బాసర ఒక మండలం. వీరు వ్యాసుడు ప్రతిష్ఠించిన సరస్వతీ దేవి విగ్రహానికి 16 స్తంభాల గుడి కట్టించారు. కోనేరుకు శాశ్వత నిర్మాణం చేశారు. బాసరలో పూజలు చేసి కుకటేశ్వర, సూర్యేశ్వర, వేంకటేశ్వర, చింతామని గణేశ్, పాపహరేశ్వర, దత్తాత్రేయ ఆలయాలు నిర్మించారు. వీరు నిర్మించిన ప్రతి మందిర స్తంభాలకు వారి శాసనాలు ఉన్నాయి. ఇతర రాజుల పాలనతో ఈ ఆలయం విశేషాలు అంతగా లభించలేదు. వ్యాపారులు రహస్యంగా తన ధనాన్ని తీసుకెళ్లడానికి దత్తాత్రేయ మందిరం నుంచి చివరన ఉన్న పాపహరేశ్వర ఆలయం వరకు సొరంగ మార్గం నిర్మించినట్లు ఉంది. సరస్వతీ దేవి, మహాలక్ష్మీ, మహంకాళిలను ప్రతిష్ఠించాలని వ్యాసుడు నిర్ణయించాడు. పండితులు అమ్మవారు ప్రతిష్ఠాపనకు కేటాయించిన స్థలంలో పూజలు ప్రారంభించారు. పూజల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను మందిరంలోని వేరు ప్రదేశంలో పెట్టారు. పూజలు పూర్తి కాకపోవడంతో విగ్రహాలు అక్కడే ఉండిపోయాయి. దీంతో చేసేదేమీలేక ఇక్కడే ఆలయం కట్టించారు. సరస్వతీ విగ్రహానికి ఎదురుగా నమస్కరిస్తున్న భంగిమలో మక్కాజీ పటేల్ విగ్రహం ఉంది. ఆ తర్వాత వచ్చినవారు దీన్ని గర్భగుడి పక్కన బయట పెట్టారు.
అమ్మవారి ఆభరణాలు బండ రాయిలో…
గతంలో ఆలయం చుట్టూ భయంకరమైన అడవి, క్రూర మృగాలు సంచరించేవి. దొంగల భయం కూడా ఎక్కవగా ఉండేది. దీంతో పూజలు చేసేందుకు ఎక్కువగా వచ్చే వారు కాదు. బాసర సమీపంలోని ఓ బండపై అమ్మవారు స్నానం ఆచరించే వారని భావించి భక్తులు అక్కడే పూజలు చేసేవారు. అప్పట్లో పూజారులు మాత్రమే ఆలయానికి వెళ్లి పూజలు చేసి తిరిగి వచ్చేవారు. సరస్వతీ అ్మమవారి నగలు, ఇతర సామగ్రిని తీసుకువచ్చి గ్రామస్తులు సమీపంలోని బండరాయి లోపల దాచేవారు.
మూడు రోజుల పాటు ఉత్సవాలు
ఆలయం నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు మాఘ శుద్ధ పంచమి రోజు అమ్మవారి జన్మదినాన్ని నిర్వహిస్తారు. వసంత పంచమి శుభదినాన బాసరకు భక్తులు పోటెత్తుతారు. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో వసంత పంచమి వేడుకలు జరుగుతాయి. సరస్వతీ జన్మదినం కావడంతో పిల్లలకు అక్షర శ్రీకారం చేయించేందుకు వేలాది మంది బాసరకు తరలివస్తున్నారు.
ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు
వసంత పంచమిని పురస్కరించుకొని బాసరలో జరిగే అమ్మవారి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యేటా పట్టు వస్ర్తాలను సమర్పిస్తున్నది. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, అటవీ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారికంగా అమ్మవారికి పట్టు వస్ర్తాలు అందించనున్నారు. ఆలయ చైర్మన్, ఈవో, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డితో పాటు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం పంపారు.
ఏర్పాట్లు పూర్తి
వసంత పంచమి పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో విజయరామారావు పేర్కొన్నారు. బాసర ఆలయంలోని వేములవాడ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వసంత పంచమి రోజున అన్ని అర్జిత సేవలు నిలిపివేశారు. ఉదయం2 గంటలకు అమ్మవారి అభిషేకం, 3 గంటలకు అక్షరాభ్యాసం ప్రారంభం, ఉదయం 7గంటలకు అమ్మవారికి ప్ర భుత్వం తరుఫున పట్టు వస్ర్తాల సమర్పన ఉంటుందన్నారు. అలాగే అక్షరాభ్యాసం కోసం 4 మండపాలు, సేద తీరేందుకు తాత్కాలిక పందిళ్లు, బయోటాయిలెట్లు, 3 ఉచిత పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బాసరకు ప్రత్యేక బస్సులు
వసంతపంచమిని పురస్కరించుకుని నిర్మల్ నుంచి బాసరకు ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ఎన్. సాయన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉత్సవాలు ప్రారంభం
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయంలో అర్చకులు గణపతిపూజ, కలశస్థాపన, హారతి నివేదన, పుణ్యహవచనం, రుత్విగ్ వరణం యాగశాల ప్రవేశం, మండప స్థాపన, స్థాపిత దేవతా హవనం, నీరాజన మంత్రపుష్ప పూజలు నిర్వహించారు. పలువురు చిన్నారులకు అక్షర శ్రీకారాలు జరిపించారు. ఈవో విజయరామరావు, ఆలయ వైదిక సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు.