చెన్నై, ఫిబ్రవరి 5: నీట్ వ్యతిరేక బిల్లుకు మళ్లీ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపాలని, ఇందు కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించడానికి ఉద్దేశించిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పి పంపిన నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం శనివారం అఖిలపక్షం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్నాడీఎంకే, బీజేపీ హాజరు కాలేదు. అఖిల పక్షంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించడం లేదని ఆరోపించారు. నీట్ వ్యతిరేక బిల్లును 142 రోజులు తన దగ్గరే పెట్టుకొన్నారని పేర్కొన్నారు. దీనిపై తాను స్వయంగా గవర్నర్ను కలిసినట్టు చెప్పారు. నీట్ బిల్లుకు మళ్లీ తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపితే గవర్నర్ ఆ బిల్లును తన దగ్గరే పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కచ్చితంగా రాష్ట్రపతి అనుమతి కోసం పంపాల్సి ఉంటుంది.