కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభ్వుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువత కోసం కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం సౌజన్యంతో ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. స్థానిక టీఎన్జీవోస్ ఫంక్షన్ హాలులో రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ సదస్సును బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఫ్యాకల్టీలు వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ బాలలత మల్లవరపు, జగిత్యాల ఎస్పీ సింధుశర్మ అవగాహన కల్పించారు.
పోటీ పరీక్షలను ఏవిధంగా ఎదుర్కోవాలి?, స్టడీస్కిల్ను ఎలా డెవలప్ చేసుకోవాలి?, చదివిన విషయాలను ఏవిధంగా గుర్తుంచుకోవాలో వివరించారు. వక్తలు ఒక్కో అంశం గురించి సవివరంగా ఉద్యోగార్థులకు వివరించారు. సమకాలీన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఏవిధంగా పట్టు సాధించాలో సూచించారు. గ్రూప్-1కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఎస్ఏతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాలపై ఏవిధంగా పట్టు సాధించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. సదస్సు ఆసాంతం ఆసక్తిగా విన్న నిరుద్యోగులు.. అనంతరం నిర్వహించిన ప్రశ్నావళి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వక్తల ఎదుట తమ అనుమానాలను వ్యక్తంచేశారు. ఈ సదస్సు తమ ఉద్యోగసాధనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు.