ఇబ్రహీంపట్నం, నవంబర్ 24 : కుటుంబ సంక్షేమంలో భార్యాభర్తలిద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది. స్త్రీలకు చేయూతనందించేందుకు ప్రభుత్వం వ్యాసెక్టమీ ఆపరేషన్ల వైపు పురుషుల దృష్టి మల్లించేలా జిల్లా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. కేవలం ఇప్పటి వరకు మహిళలే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని స్త్రీలకు బాసటగా నిలువాల్సిన బాధ్యతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి కాన్పుకు ప్రైవేటు దవాఖానల్లో ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక్కో స్త్రీ రెండుసార్లు ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో కుటుంబ నియంత్రణకు పురుషుల భాగస్వామ్యం పెరుగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో పురుషుల సంఖ్యను పెంచేందుకు వైద్యారోగ్యశాఖ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 4వరకు జిల్లాలోని వివిధ ఏరియా దవాఖానలు, పీహెచ్సీల్లో వ్యాసెక్టమీ ఆపరేషన్ల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. వ్యాసెక్టమీ ఆపరేషన్లలో పురుషులు అధికంగా పాల్గొనేలా అవగాహన కల్పించే బాధ్యతను ఏఎన్ఎంలు, ఆశావర్కర్లకు అప్పగించారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న పురుషులకు ప్రభుత్వం రూ.1100 పారితోషికాన్ని ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పదిహేను రోజులకోసారి వివిధ ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో వ్యాసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
శస్త్ర చికిత్సకు రూ.1100 పారితోషికం..
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 4వరకు నిర్వహించే శిబిరాల్లో వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రభుత్వం రూ.1100ల పారితోషికాన్ని ప్రకటించింది. ఈ శస్త్ర చికిత్స కార్యక్రమంలో పురుషులు అధికంగా పాలుపంచుకునేలా చర్యలు తీసుకునే బాధ్యతను ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రభుత్వం అందించే పథకాల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
29 నుంచి డిసెంబర్ 4 వరకు ఆపరేషన్లు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఈ నెల 29 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. పురుషులు ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని క్యాంపులను నిర్వహిస్తున్నది. ఈ నెల 29న ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో (వ్యాసెక్టమీ) కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈనెల 30న సరూర్నగర్ పీహెచ్సీలో, డిసెంబర్ 1న శంషాబాద్ ఏరియా దవాఖాన, డిసెంబర్ 2న షాద్నగర్ ఏరియా దవాఖాన, డిసెంబర్ 3న చేవెళ్ల ఏరియా దవాఖాన, డిసెంబర్ 4న కందుకూరు పీహెచ్సీలో ప్రత్యేక శస్త్ర చికిత్స క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
ఎలాంటి ఇబ్బందులుడవు
మగవారికి కోత, కుట్టులేని అతి సులువైన ఆపరేషన్ నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు
ఈ ఆపరేషన్ కేవలం 5 నుంచి15 నిమిషాల్లో పూర్తి
ఆపరేషన్ అనంతరం అరగంట తరువాత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లొచ్చు
లైంగిక పటుత్వంలో ఎటువంటి మార్పుగాని, దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం గాని ఉండవు
ఆపరేషన్ అయిన మూడు రోజుల నుంచే అన్ని పనులు చేసుకోవచ్చు. ఎటువంటి అపోహలకు తావులేదు