నిజామాబాద్ : దళితులు తలెత్తుకుని బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాల పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన దళితబంధు యూనిట్లను రుద్రూరులోని జనరల్ ఫంక్షన్ హాల్ వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..కొత్త బడ్జెట్ ప్రకారం నియోజకవర్గానికి రెండు వేల మందికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇలా సంవత్సరానికి కొంతమంది చొప్పున అందరికి దళితబంధు అమలు చేస్తామన్నారు. ఈ పథకం లబ్ధిదారులు తమకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవచ్చని సూచించారు. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.