అలీఘఢ్ : హిజాబ్ వివాదంపై స్పందిస్తూ సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని కొన్ని విద్యాసంస్ధల్లో డ్రెస్ కోడ్ అమలు, హిజాబ్పై నిషేధం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపధ్యంలో ఎవరైనా మా హిజాబ్ను టచ్ చేస్తే వారి చేతులు నరుకుతామని ఎస్పీ నేత రుబినా ఖానుం హెచ్చరించారు. కర్నాటకలోని ఉడిపిలో ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజ్లోకి హిజాబ్ ధరించిన విద్యార్ధినులను అనుమతించకపోవడంతో వివాదం రాజుకుంది.
ఈ ఘటనతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హిజాబ్ బ్యాన్పై నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలతో స్కూళ్లు, కాలేజీలు అట్టుడకడంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. ఆయా విద్యాసంస్ధల యాజమాన్యాలు నిర్ధేశించిన యూనిఫాంను అనుసరించాలని విద్యార్ధినీ విద్యార్ధులకు కర్నాటక ప్రభుత్వం సూచించింది.
డ్రెస్ కోడ్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకూ రాష్ట్రంలో విద్యాసంస్ధల్లోని తరగతి గదుల్లో ఎలాంటి మతపరమైన డ్రెస్లు ధరించరాదని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ బీజేపీ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం విద్యార్ధినుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని విమర్శించారు.