Bharat Gaurav | పర్యాటకులకు కోసం ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శనకు వెళ్లాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 18, ఏప్రిల్ 18న ఆయా రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరనున్నాయి. ప్యాకేజీ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ బుధవారం ప్రకటించారు. రైలు ఈ నెల 18 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరుతుంది. ఎనిమిది రోజుల పాటు పూరీ, కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ల తదితర ప్రాంతాలను సందర్శించి.. 26న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అలాగే ఏప్రిల్ 18న సైతం రెండో రైలు మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరి.. ఏప్రిల్ 25న రాత్రి 11గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మొదట ఒడిశాలో ఉన్న పూరీ, కోణార్క్కు వెళ్తుంది. అక్కడి నుంచి గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ల మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగనున్నది. ఈ రైల్లో మొత్తం 700 సీట్లు అందుబాటులో ఉండగా.. 460 స్లీపర్ బెర్తులు, 192 థర్డ్ ఏసీ బెర్త్లు, 48 సెకండ్ ఏసీ బెర్త్లు ఉంటాయి. యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరాలను దర్శించుకునేందుకు అవకాశం ఉందని రైల్వే జీఎం తెలిపారు. యాత్ర మొత్తం తొమ్మిది రోజులు, ఎనిమిది రాత్రుల పాటు కొనసాగుతుందన్నారు. మొదటి రైలుకు ఇప్పటికే విశేష ఆదరణ లభిస్తోందని, 90శాతం సీట్లు నిండిపోయాయని పేర్కొన్నారు. రెండో రైలులో ఇప్పటికే 20శాతం సీట్లు భర్తీ అయ్యాయన్నారు.
భారత్ గౌరవ్ రైలులో మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉండనున్నాయి. స్లీపర్ తరగతి (ఎకానమీ)లో టికెట్ ధర ఒకరికి స్లీపర్ క్లాస్లో రూ.15,300, థర్డ్ ఏసీలో రూ.24,085, సెకండ్ ఏసీ రూ.31,500 అని జీఎం తెలిపారు. డబుల్, ట్రిపుల్ షేర్లో ఒక్కొక్కరికి రూ.13,955, థర్డ్ ఏసీ రూ.22,510, సెకండ్ ఏసీలో రూ.29,615గా నిర్ణయించినట్లు తెలిపారు. ఐదు నుంచి 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.13,060, రూ.21,460, రూ.28,360గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. యాత్రికులు ప్రయాణించిన తరగతులను బట్టి వారికి గదుల కేటాయింపు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పుణ్యక్షేత్ర రైలులో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుందని, ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావని తెలిపారు. వీటికి పర్యాటకులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఏదైనా కారణంతో బుకింగ్ను క్యాన్సిల్ చేసుకుంటే.. యాత్ర 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే రూ.250 క్యాన్సిల్ చార్జీగా నిర్ణయించామని, అదే 8-14 రోజుల్లోపు అయితే టికెట్ మొత్తం ధరలో 25శాతం, 4 -7 రోజుల్లోపు అయితే 50శాతం, నాలుగు రోజుల కన్నా తక్కువ ఉంటే వందశాతం డబ్బును కోల్పోవాల్సి రానున్నది.