న్యూఢిల్లీ: టీ20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగనున్నది. టెంబ బవుమ నేతృత్వంలో సౌతాఫ్రికా జట్టు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. రేపటి నుంచి ఆ జట్టు ప్రాక్టీస్ను ప్రారంభిస్తుంది. అయితే ప్రతి రోజు ఆటగాళ్లకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇండియన్ ప్లేయర్లు మాత్రం జూన్ 5వ తేదీన ఢిల్లీకి చేరుకోనున్నారు. భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా రంగంలోకి దిగనున్నాడు. రోహిత్, విరాట్లకు రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్థిక్ పాండ్యాలను మళ్లీ ఇండియన్ టీమ్లోకి తీసుకున్నారు. స్పీడ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ఆర్షదీప్ సింగ్కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య 15 టీ20 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో ఇండియా తొమ్మిదింట్లో గెలవగా, ఆరు సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించింది.