ముంబై: ప్రజలు మాట్లాడుకునే దానిని ఎవరూ ఆపలేరని.. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే కెప్టెన్గా ఎంపికైన అనంతరం ‘హిట్మ్యాన్’రోహిత్ తొలిసారి ఆదివారం బీసీసీఐ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘భారత జట్టుకు ఆడేప్పుడు ఒత్తిడి తీవ్రంగానే ఉంటుంది. కెప్టెన్సీ అంటే మామూలు విషయం కాదు. అభిమానులు మనలోని పాజిటివ్, నెగెటివ్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే క్రికెటర్గా నాకు మాత్రం ఆట మీద దృష్టి సారించడమే ముఖ్యం. ప్రజలు ఏం మాట్లాడుకుంటారనే దానిని ఎవరూ నియంత్రించలేరు. జట్టుకు అవసరమైన సమయాన నా భాగస్వామ్యం తప్పకుండా అందిస్తా. భారీ టోర్నమెంట్లలో ఆడేప్పుడు మిగతా జట్టు సభ్యులు కూడా అర్థం చేసుకుని రాణించేందుకు ప్రయత్నిస్తారు. మేము ఏం చేయగలమో దాని మీదనే దృష్టి సారిస్తాం. విజయం సాధించేందుకు ఆడుతాం. బయట ఎవరు ఏం మాట్లాడుకుంటారనే దాని గురించి ఆలోచించం. అవన్నీ అనవసరం. జట్టులోని ప్రతి ఒక్కరూ ముఖ్యమే. అందరితోనూ మంచి అనుబంధం ఉంది. దానిని ఇంకా బలోపేతం చేసుకుంటాం. అప్పుడు మేం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని చేరుకోగలం. రాహుల్ ద్రవిడ్ భాయ్ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నాడు’అని రోహిత్ తెలిపాడు.