న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేను సోనియా గాంధీ అభినందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ విజయం భారత్ విజయంతో సమానమని వ్యాఖ్యానించారు. ఖర్గే అనుభవమున్న నేతని, ఆయన కష్టపడి పనిచేసి సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే స్ధాయికి ఎదిగారని, ఖర్గే పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాతని సోనియా పేర్కొన్నారు.
ఖర్గేకు బాధ్యతలు అప్పగించిన తర్వాత తాను ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి దిగజారుతోందని అంగీకరిస్తూ దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఏనాడు ఓటమిని అంగీకరించకుండా పోరాటం కొనసాగిస్తోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ఇది ఏండ్ల తరబడి ఉద్యమ పధంలో సాగుతూ ముందుకు వెళుతున్న సంస్ధని ఆమె అభివర్ణించారు.
ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లను మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లున్నాయని, దేశ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ప్రమాదంతో పోరాడటం అతిపెద్ద సవాలని అన్నారు. కాంగ్రెస్ చీఫ్గా తాను పూర్తి సామర్ధ్యంతో పనిచేశానని..ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం తనకు సంతృప్తి ఇస్తోందని చెప్పారు.