ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్నతల్లిని ఓ కుమారుడు ఏమాత్రం కనికరం లేకుండా సజీవదహనం చేశాడు. తల్లిని గదిలో బంధించి, ఆ గదిలోకి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. దాంతో ఆ వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ పాశవిక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఒంగోలు పట్టణంలోని గద్దలగుంట ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది. కొంతకాలంగా తల్లితో గొడవ పడుతున్న కుమారుడు.. ఈ రోజు కూడా మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనయ్యాడు. తల్లిని గదిలో పెట్టి బయట నుంచి తాళం వేశాడు. అనంతరం గదిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంటి నుంచి దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే లోపల ఉన్న వృద్ధురాలు పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.