వరంగల్, నవంబర్ 23(నమస్తేతెలంగాణ): ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి పోడు భూముల సమస్య ఉన్న గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన గ్రామసభలు నిర్వహించారు. స్థానికులతో అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లాలో 21,799 ఎకరాల కోసం 7,389 మంది దరఖాస్తు చేసుకున్నట్లు నివేదికలో వెల్లడించారు. పోడు రైతుల్లో ఎక్కువగా గిరిజనులే ఉన్నందున సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీంతో కలెక్టర్ బీ గోపి పలు శాఖల అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. పోడు భూముల సమస్య ఉన్న గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ, అటవీ హక్కుల కమిటీల ఏర్పాటు, పోడుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణకు జిల్లాస్థాయి అధికారులను మండలానికి ఒకరి చొప్పున నియమించారు. అధికారులు పోడు భూముల సమస్య పరిష్కారంపై మండల, గ్రామ పంచాయతీ, హ్యాబిటేషన్ స్థాయిలోనూ అవగాహన సదస్సులు నిర్వహించారు. అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జహీరొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ క్షేత్రస్థాయిలో సదస్సులను పర్యవేక్షించారు.
హ్యాబిటేషన్లలో గ్రామసభలు
ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల పరిధిలో పోడు భూముల సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 35 జీపీల పరిధిలో 64 హ్యాబిటేషన్లు ఉండగా, ప్రతి హ్యాబిటేషన్లో దరఖాస్తుల స్వీకరణకు అధికారులు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. కార్యదర్శి, ఫారెస్టు బీట్ అధికారి(ఎఫ్బీవో), వీఆర్ఏ ఈ కమిటీల్లో సభ్యులు. సూపర్వైజర్ కమిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ సభ్యులుగా వ్యవహరించారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ప్రతి హ్యాబిటేషన్లో గ్రామస్థాయి కమిటీలు గ్రామసభలు ఏర్పాటు చేశాయి. సభలకు హాజరైన స్థానికుల్లో 10 నుంచి 15 మందితో అటవీ హక్కుల కమిటీలను నియమించాయి. వీటి ద్వారా పోడుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. నర్సంపేట ఆర్డీవోతోపాటు తాసిల్దార్లు, ప్రత్యేక అధికారులు కూడా గ్రామసభలకు హాజరయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించారు.
7,389 దరఖాస్తులు
ఐదు మండలాల్లోని 64 హ్యాబిటేషన్లలో 7,389 మంది రైతులు గ్రామసభల్లో అటవీ హక్కుల కమిటీలకు దరఖాస్తులు అందజేశారు. వీరిలో ఎస్టీలు 3,689, ఇతరులు 3,700 మంది ఉన్నారు. మండలాల వారీగా ఖానాపురం నుంచి ఎస్టీలు 1,679, ఇతరులు 1,923 మంది, నర్సంపేట నుంచి ఎస్టీలు 503, ఇతరులు 461, నల్లబెల్లి నుంచి ఎస్టీలు 1,098, ఇతరులు 301, నెక్కొండ నుంచి ఎస్టీలు 377, ఇతరులు 301, చెన్నారావుపేట నుంచి ఎస్టీలు 32, ఇతరులు 79 మంది దరఖాస్తులు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 7,389 మంది 21,799 ఎకరాల అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్టీల ఆధీనంలో 11,313, ఇతరుల ఆధీనంలో 10,486 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. మండలాల వారీగా ఖానాపురంలో ఎస్టీలు 5,093, ఇతరులు 4,874, నర్సంపేటలో ఎస్టీలు 1,156, ఇతరులు 964, నల్లబెల్లిలో ఎస్టీలు 3,952, ఇతరులు 3,746, నెక్కొండలో ఎస్టీలు 1,027, ఇతరులు 703, చెన్నారావుపేటలో ఎస్టీలు 86, ఇతరులు 200 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు దరఖాస్తుల ద్వారా తెలుస్తుందని తాజాగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.