హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన ఒక్క ప్రకటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తున్నది. అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు రైతు సమూహంలో కదలిక తీసుకవచ్చింది. కేసీఆర్ బాటలోనే కేంద్రాన్ని నిలదీసేందుకు.. నిగ్గు తేల్చేందుకు అడుగులు పడుతున్నాయి. అన్నదాతల పక్షాన వెన్నంటి నిలిచిన కేసీఆర్ను యావత్ దేశం వేనోళ్లా కొనియాడుతున్నది. అత్యున్నత మానవీయ దృక్పథంతో అమర రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ముఖ్యమంత్రికి జోతలు పెడుతున్నది. సాగు చట్టాల రద్దు కోసం వీరోచిత పోరాటం చేస్తూ అమరులైన 700 మంది రైతుల కుటుంబాలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోయినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదుకొనేందుకు ముందుకు వచ్చారని సంయుక్త్ కిసాన్ మోర్చా కొనియాడింది.
రైతుల త్యాగాలను కేసీఆర్ గుర్తించారని తెలిపింది. అమరులైన రైతు కుటుంబాలకు రూ.3 లక్షలు ఇవ్వటంతోపాటు కేంద్రం రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, రైతులపై, ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేయటం మంచి విషయమని పేర్కొన్నది. అమరులైన రైతుల కుటుంబాల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి సంయుక్త్ కిసాన్ మోర్చా అందజేస్తుందని వెల్లడించింది. అమర కిసాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్లో వెల్లడించగా, ఆ ట్వీట్ను కిసాన్ ఏక్తా మోర్చా రీట్వీట్ చేసింది.
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని.. కేంద్రం కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా రూ.25 లక్షల చొప్పున చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి నోట మాట వెలువడిన నాటినుంచి కేంద్రంపై ఒత్తిడి మరింత తీవ్రమైంది. ఒకపక్క కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరోపక్క అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఊపందుకొన్నది. ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమానటులు ఇలా ఒకరేమిటి.. అనేక రంగాలకు చెందిన ప్రముఖులంతా సీఎం కేసీఆర్ అడుగులో అడుగు కలుపుతున్నారు.
నాడు 2019లో పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైనప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్ద్రతతో ముందుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఆయన బాటలో ఇతర రాష్ర్టాలు పయనించి ఆ సైనిక కుటుంబాలకు తమవంతు సాయాన్ని అందించాయి. గాల్వాన్ దగ్గర చైనా దొంగదాడికి చనిపోయిన తెలంగాణ వీరుడు సంతోష్బాబుకు 5 కోట్ల పరిహారం ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకొన్నారు. ఆ దాడిలో వీరమరణం పొందిన వివిధ రాష్ర్టాలకు చెందిన మిగతా 19 మంది జవాన్లకూ రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని అందించారు. ఇప్పుడు రైతు ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుగా అడుగు వేసిన కేసీఆర్.. ‘జై జవాన్.. నేడు జై కిసాన్’ అన్న నినాదాన్ని ఆచరించి చూపారని అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తున్నది.
అంతేకాదు.. రైతు సుఖంగా ఉండాలంటే కనీస మద్దతు ధరపై చట్టం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్నూ దేశమంతా అందిపుచ్చుకొన్నది. కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట్టుగా కనీస మద్దతు ధరపై చట్టం చేయాల్సిందేనని దేశం యావత్తూ ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. సంయుక్త కిసాన్ మోర్చా సైతం దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కోరుతున్నది. జాతీయ రాజకీయ నాయకులు అఖిలేశ్యాదవ్, మాయావతి, ఒమర్ అబ్దుల్లా, వరుణ్ గాంధీ, హేమంత్ సొరేన్, ప్రియాంకాగాంధీ.. ఇలా ఒకరేమిటి.. కేంద్ర రాజకీయ నాయకత్వం అంతా కేసీఆర్ డిమాండ్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు.
సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించిన కేసీఆర్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ నటులు కేసీఆర్ నిర్ణయాన్ని కొనియాడుతూ నెట్టింట్లో కామెంట్లు, ట్వీట్లు, రీట్వీట్లు, లైక్లతో హోరెత్తిస్తున్నారు. ‘ప్రజల మనిషిపై మరింత గౌరవం పెరిగింద’ని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం కేసీఆర్ బాటలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. కేసీఆర్ డిమాండ్ చేసినట్టు కేంద్రం పరిహారం ఇవ్వాల్సిందేనని, కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.