స్మగ్లర్ షేక్ యాసిన్ అరెస్ట్
140 కిలోల సరుకు స్వాధీనం
ఏపీ నుంచి ముంబైకి సరఫరా
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో గెస్ట్ హౌస్.. అందులో చిన్న గుడారం.. అక్కడ ఎవరైనా అడుగుపెడితే.. మీద పడి కరిచేలా.. చుట్టూ కాపలాగా ఐదు కుక్కలు.. పోలీసులకు దొరకకుండా గంజాయి స్మగ్లర్ షేక్ యాసిన్ అలియాస్ ఫిరోజ్ చేసుకొన్న ఏర్పాట్లు ఇవి. అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు. గంజాయి దందా కొనసాగిస్తూ.. పోలీసులకు వాటెండ్గా మారాడు. చివరికి రాచకొండ ఎల్బీనగర్ స్పెషల్ టీమ్కు బుధవారం చిక్కాడు. నేరేడ్మెట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ యాసిన్ హైదరాబాద్ నాచారంలో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. 2016లో గంజాయి దందా ప్రారంభించాడు. ఆరు నెలల కిందట అతడి అనుచరులు 1,246 కిలోల గంజాయి సరఫరా చేస్తూ మేడిపల్లి పోలీసులకు చిక్కారు.
ఆ కేసులో యాసిన్ పోలీసులకు వాంటెడ్గా మారాడు. బుధవారం యాసిన్ ఏపీలోని అరకులో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి 140 కిలోల గంజాయి తీసుకొని కారులో వస్తున్నట్టు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆదిబట్ల టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసులతో కలిసి షేక్ యాసిన్, చుంచు రవీందర్, మంద బాబులను పట్టుకొన్నారు. విచారణలో వారు ఈ గంజాయిని ముంబైలోని మాజిద్ అలియాస్ బాబుకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. నిందితుల నుంచి గంజాయి, రూ.5 లక్షలు, రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ముఠాను పట్టుకొన్న ఎస్వోటీ బృందానికి సీపీ రివార్డు అందజేశారు.