ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు? – విశ్వనాథ్, కామారెడ్డి
తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు రోజులపాటు అశౌచం (మైల) పాటించాలి. ఆ సమయంలో పితృకర్మలు మినహా ఏ శుభకార్యంలోనూ పాల్గొనరాదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ పన్నెండు రోజులు చనిపోయిన వ్యక్తి పేరుమీద సంతాప దినాలు పాటించాలి. పన్నెండో రోజు మైల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంట్లోని వ్యక్తి పోయిన బాధ నుంచి తేరుకోవడం కోసం, దుఃఖం నుంచి ఒడ్డున వేయవలసిందిగా ధ్యానించడం కోసం శివాలయానికి గానీ, ఆంజనేయుడి గుడికి గానీ వెళ్లి నిద్ర చేయడమనేది సంప్రదాయం. పుట్టెడు దుఃఖంలో కొందరికి వైరాగ్య భావనలు కలుగుతాయి, మరికొందరు తీవ్ర మనస్తాపంతో విపరీత నిర్ణయాలు తీసుకునే ప్రమాదమూ ఉంటుంది. వారికి దైవం అండగా ఉంటాడన్న భరోసా కల్పించడానికి ఆలయంలో నిద్ర చేయమని సూచించారు మన పెద్దలు. ఆ తర్వాత తమతమ ఆప్తుల ఇండ్లకు నిద్రకు వెళ్లినా ఇలాంటి ఓదార్పు కోసమే.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370