బన్సీలాల్పేట్, జనవరి 14: పని చేయలేక పోతున్నాడు.. పైగా మాట్లాడలేక పోతున్నాడు.. ఎవ్వరికీ ఏం చెప్పుకోలేడకున్నారో ఏమో.. ఇదే అదనుగా ఆ కుటుంబ సభ్యులు.. ఇంటి పెద్దాయనను నడిరోడ్డుపై వదిలివెళ్లారు.కాస్త మనసు కలగజేసుకుని చిలకలగూడ పోలీసులు, స్కై ఫౌండేషన్ సేవా సంస్థ వాళ్లు చేరదీయడంతో సదరు వృద్ధుడిని సరైన చోటికి పంపించగలిగారు. అతడో 70 ఏండ్ల వృద్ధుడు. ఏ పనిచేయలేక, మాట్లాడలేక పోతున్నాడు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్లోని గాంధీ దవాఖాన వద్ద దింపి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దవాఖాన పరిసరాలలో తిరుగుతూ ఉన్నాడు. అతడి పరిస్థితి గమనించిన చిలకలగూడ పోలీసు ఔట్ పోస్ట్లో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ రమేశ్ బాబు, ఆ వృద్ధుడిని పలకరించి వివరాలు సేకరించగా.. తన పేరు వెంకట్రావ్, నాగోల్లో ఉంటామని, ఎలక్ట్రీషియన్గా పనిచేసినట్టు చెప్పగలిగాడు. ఇంట్లో వాళ్లే తనను ఇక్కడ వదిలివెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పద్మారావునగర్లోని స్కై ఫౌండేషన్కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షురాలు ఓ.పావనిలు వృద్ధుడికి ఆహారం, దుస్తులు అందించారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ జి.నరేశ్ ఇచ్చిన సిఫారసు లేఖను తీసుకుని తమ వ్యానులో వెంకట్రావ్ను తీసుకెళ్లి చెంగిచెర్లలోని అమ్మ సేవా సమితి అనాథ, వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు.