న్యూఢిల్లీ: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు సోమవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. గతేడాది నవంబర్లో ఆందోళనల విరమణ సమయంలో ఇచ్చిన హామీలను మోదీ సర్కార్ ఇంకా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించే అంశంపై ఎస్కేఎం నేతలు చర్చించనున్నట్టు తెలుస్తున్నది. బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టంతో పాటు ఏడాది పాటు సాగిన ఆందోళనల సమయంలో పలు రాష్ర్టాల్లో రైతులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని, ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.