హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన రైతులకు సీఎం కేసీఆర్ రూ.3లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు, పలువురు రాజకీయ ప్రముఖులు సీఎం కేసీఆర్ ఔదార్యాన్ని ప్రశంసించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని పేర్కొన్నారు.
చట్టాలను రద్దు చేసినట్లుగానే రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తి వేయాలని ప్రధానిని డిమాండ్ చేశారు. రైతులకు సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇచ్చి, వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు రూ.3లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా సైతం సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రకటనను స్వాగతించింది. ఆందోళనలో సుమారు 700 మంది రైతులు చేసిన త్యాగాలను నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం గుర్తించనప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నది.
ఇంకా సీఎం కేసీఆర్ బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు సాయం ప్రకటించారని.. అలాగే ప్రతి రైతు కుటుంబానికి భారత ప్రభుత్వం రూ.25లక్షలు చెల్లించాలని, రైతులపై పెట్టిన అన్ని బేషరతుగా ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారని తెలిపింది. అమరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి జాబితాను అందజేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ట్వీట్ చేసింది.