అమరావతి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి( Rajahmundry ) లో కల్తీ పాలు ( Adulterated Milk ) తాగిన ఘటనలో మరో బాధితుడు మృతి చెందాడు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యారావు( Surya rao ) అనే వ్యక్తి చనిపోయాడు. మరో 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మృతుల సంఖ్య 7కు చేరుకుంది.
పాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయులు అసాధారణంగా పెరిగినట్లు గుర్తించడం వల్ల మూత్రపిండాల వైఫల్యానికి దారి తీయడంతో బాధితులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కల్తీ పాలు కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో ఉన్న ‘ వరలక్ష్మీ మిల్క్ డెయిరీ’ నుంచి సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. సదరు డెయిరీ నుంచి సుమారు 106 కుటుంబాలకు ఈ పాలు అందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం, ఆ డెయిరీ నుంచి పాల సరఫరాను నిలిపివేయడంతో పాటు ప్లాంట్ను సీజ్ చేసింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది బాధితుల్లో కొందరు వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి మిల్క్ డెయిరీలో సేకరించిన ఆధారాలతో సహా నిర్వాహకుడు గణేష్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరు పరచగా అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు.
గత నెల 14వ తేదీన పాలు తక్కువగా సేకరించడం వల్ల పాలు చిక్కగా కనిపించేందుకు యూరియా, డిటర్జెంట్ పొడి, నూనె వంటి పదార్థాలు కలిపి కల్తీ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. కల్తీ చేసిన పాలను ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల కూలెంట్ ఆయిల్ లీకై పాలు కలుషితమయ్యాయని తెలిపారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.