ఘట్కేసర్, జనవరి 4 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు జాయింట్ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, కమిషనర్ వసంత ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మున్సిపాలిటీలో అనుకూలంగా ఉన్న వివిధ స్థలాలను పరిశీలించారు. హెచ్ఎండీఏ పరిధిలోని అవుటర్ రింగ్రోడ్డు పక్కన గల నర్సరీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కొండాపూర్లో గల 166,152 సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని ముస్లింల శ్మశానవాటిక కోసం పరిశీలించారు. ఘట్కేసర్లో కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు, తాసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తాసీల్దార్ భాస్కర్ రెడ్డి, ఆర్ఐ అలేఖ్య, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.