Bangladesh | బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో రాజధాని ఢాకా నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్పూర్లో శుక్రవారం రాత్రి నిర్వహించాల్సిన ప్రసిద్ధ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ చివరి నిమిషంలో రద్దయ్యింది.
సంగీత కచేరి శుక్రవారం రాత్రి 9 గంటలకు జరగాల్సి ఉంది. కానీ దానికంటే కొద్ది నిమిషాల ముందు ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. షోకు హాజరైన వారిపై రాళ్లు, ఇటుకలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు ప్రతిఘటించారు. వారు కూడా ఆందోళకారులపై ఎదురుదాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో స్థానిక అధికారుల సూచన మేరకు జేమ్స్ కాన్సర్ట్ను రద్దు చేశారు.
Islamist mob attacks concert of Bangladesh’s biggest rockstar James at Faridpur. James has sung for Bollywood also. The mob wants no music or cultural festivals to be held in Bangladesh. James somehow managed to escape. pic.twitter.com/0yNeU0Us9h
— Deep Halder (@deepscribble) December 26, 2025
ఈ ఘటనపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్లో సాంస్కృతిక కార్యక్రమాలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పలు సంస్థలపై దాడులు జరిగాయని.. తాజాగా జేమ్స్ కాన్సర్ట్ను కూడా అడ్డుకున్నారని సోషల్మీడియా వేదికగా తెలిపారు. కళాకారులు, సంగీతం, సంస్కృతిని భద్రంగా కాపాడుకోకపోతే విదేశీ కళాకారులు కూడా బంగ్లాదేశ్కు రావడం మానేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల బంగ్లాదేశ్లో పలు అల్లరి మూకలు వీధుల్లోకి దిగుతూ, కళాకారులు, జర్నలిస్టులు, సాంస్కృతిక సంస్థలపై దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ మూకలను నియంత్రించడంతో విఫలమవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అలాగే రానున్న ఎన్నికలను వాయిదా వేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ అల్లర్లు జరిపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.