హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సింగరేణి బొగ్గు సరఫరాచేయనున్నది. ఈ రెండు సంస్థల మధ్య బుధవారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో ఒప్పందం జరిగిం ది. తెలంగాణ కోసం ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండంలో ఎన్టీపీసీ తొలి విడతగా 1,600 (2×800) మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్నది. దీనికి ఏటా 68.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. ఈ ప్లాంట్కు తొలుత కోల్ఇండియా పరిధిలోని మందాకిని బ్లాక్ నుంచి బొగ్గు కేటాయించారు.
అందుబాటులో ఉన్న సింగరేణి నుంచి బొగ్గును తీసుకోవాలని నిర్ణయించుకొన్నామని, దశాబ్దాలగా సింగరేణి నాణ్యమైన బొగ్గను సరఫరా చేస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని తెలంగాణ ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్కుమార్ స్పష్టంచేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల ప్లాంట్కే కాకుండా మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్లకు కూడా సింగరేణి నుంచే బొగ్గును తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోని ఎన్టీపీసీ కేంద్రాలకు కూడా తామే బొగ్గు సరఫరా చేయనున్నట్టు సింగరేణి ఈడీ (కోల్మూవ్మెంట్) జే అల్విన్ చెప్పారు.
సింగరేణీ జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) సూర్యనారాయణ మాట్లాడుతూ.. రామగుండం 1,600 మెగావాట్ల ప్లాంట్ విద్యుత్తులో 85 శాతం రాష్ట్ర అవసరాలకే ఉపయోగపడుతుందని, స్థానికంగా లభించే సింగరేణి బొగ్గు తీసుకోవడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి తెలంగాణకు చౌకగా విద్యుత్తు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డీజీఎం మారేపల్లి వెంకటేశ్వర్లు, అదనపు మేనేజర్ మహేందర్రెడ్డి, చీఫ్ లైజాన్ ఆఫీసర్ మహేశ్, ఎన్టీపీసీ అడిషనల్ జీఎంలు ప్రేమ్కుమార్, షిండే, సీనియర్ మేనేజర్ గాలి సుందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.