హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతమున్న థర్మల్, సౌర విద్యుత్తు ప్లాంట్లకు అదనంగా 1,050 మెగావాట్ల సామర్థ్యంతో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటుచేసి మొత్తం 3,350 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకునేలా భారీ ప్రణాళికకు సింగరేణి శ్రీకారం చుట్టింది. బుధవారం ఇక్కడ సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీనిపై థర్మల్, సౌర విద్యుత్తు విభాగాల ఉన్నతాధికారులతో సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ చర్చించారు. నెల రోజుల్లో కొత్త ప్లాంట్లకు సంబంధించిన ప్రణాళికల్ని రూపొందించి సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్దనున్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో ప్రస్తుతం 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అయితే దీన్ని 2,800 మెగావాట్లకు పెంచాలని సింగరేణి చూస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రాంగణంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో ఓ ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఇక్కడే మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలనూ పరిశీలిస్తున్నది. కాగా, ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన 120 ఎకరాల స్థలంతోపాటు నీరు, రైలు మార్గం వంటి అన్ని వసతులున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎండీ శ్రీధర్కు వివరించారు. దీంతో దీనిపై డీపీఆర్ తయారుచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన వారిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్ సత్యనారాయణరావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్కుమార్ సూర్, ఓఅండ్ఎం చీఫ్ జెఎన్ సింగ్, జీఎంలు డీవీఎస్ఎన్ రాజు, వై రాజశేఖర్రెడ్డి, ఎన్వీకేవీ రాజు, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.