శ్రీరాంపూర్ : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూ ప్రోత్సాహక అవార్డులను ప్రకటించే కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్(ముంబాయి) సంస్థ 2021వ సంవత్సరానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును శుక్రవారం జాతీయ స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో ప్రకటించారు. దక్షిణ భారత దేశంలో 500 మెగావాట్లు మరియు ఆపై స్థాయి ఉత్పత్తి సామర్ద్యం గల సుమారు 100 ప్లాంట్ల విభాగంలో ఈ అత్యుత్తమ అవార్డును సింగరేణి ఎస్టీపీపీకి ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సాధారణంగా 600 మెగావాట్ల సామర్ధ్యం గల ప్లాంట్లు ఒక యూనిట్ను ఉత్పత్తి చేయడానికి 2444 కిలో కాలరీ శక్తిని (బొగ్గును)వినియోగించవచ్చని ప్రామాణికంగా సూచిస్తుంటారు, కాగా 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత కేంద్రంలో గల రెండు ప్లాంట్లలో ఒకటో ప్లాంట్ ఒక యూనిట్ విద్యుత్కి ఉత్పత్తి నిర్దేశిత ప్రమాణాల కన్నా తక్కువగా సగటున 2425 కిలో కాలరీ శక్తిని (బొగ్గును) మాత్రమే వినియోగిస్తోంది. ఈ విధంగా అత్యంత సమర్ధంగా బొగ్గును వినియోగిస్తున్నందున గుర్తింపుగా ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తక్కువ బొగ్గుతో తగిన ఉష్ణోగ్రతను సాధించడం, ప్లాంట్ అవసరాలకు విద్యుత్, ఆయిల్ వినియోగంలోనూ పొదుపు పాటించడంతో ఈ అవార్డుకు ఎంపికైంది.
సింగరేణి ఎస్టీపీపీ కేంద్రానికి ఈ ఏడాది వరుసుగా నాలుగు అవార్డులు లభించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది , దీనిపై సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ హర్షం వ్యక్త చేస్తూ ప్లాంట్ అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాంట్ మంచి పీఎల్ఎఫ్ సాధిస్తూ దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్లలొ ఒకటిగా నిలిచిందని, ఇదే పని తీరునుకనబరుస్తూ మున్ముందు మరిన్ని విజయాలూ సాధించాలని ఆకాంక్షించారు.