సిక్కు యువరాణి ప్రిన్సెస్ సోఫియా దులీప్ సింగ్కు ‘బ్లూ ప్లాక్యూ’ గౌరవం దక్కింది. ఇంగ్లండ్లో చారిత్రక ప్రాధాన్యం ఉన్న వ్యక్తుల నివాసాలకు ఈ హోదా ప్రకటిస్తారు. ఇంగ్లిష్ హెరిటేజ్ చారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఏడాది ఆ గౌరవం ప్రిన్సెస్ సోఫియా ఇంటిని వరించింది. బ్రిటిష్ ఇండియా యువరాణి సోఫియా దులీప్ సింగ్ 19వ శతాబ్దంలో లండన్లో నివసించారు. సిక్కు సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి మహారాజా దులీప్ సింగ్ కుమార్తె ఆమె. బ్రిటన్లో మహిళల ఓటు హక్కు కోసం జరిగిన ఉద్యమంలో సోఫియా చురుగ్గా పాల్గొన్నారు.
ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్లోనూ కీలక పాత్ర పోషించారు. విక్టోరియా మహారాణి మనసునూ గెలుచుకున్నారు. ఆమె మానస పుత్రికగా ఖ్యాతికెక్కారు. సోఫియా 1948లో మరణించారు. తాజాగా ప్రత్యేక గుర్తింపును పొందిన సోఫియా నివాసం పేరు ‘ఫరాడే’ హౌస్. దీన్ని సాక్షాత్తు విక్టోరియా మహారాణి ప్రిన్సెస్కు పుట్టినరోజు కానుకగా ఇచ్చారని అంటారు.