న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలున్నాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాలు వీటికి బలాన్నిస్తున్నాయి. పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇండోర్ నుంచి ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా, జనతాదళ్ నేత సీపీ సింగ్ సైతం దేశ రాజధానికి చేరుకున్నారని సమాచారం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం ముఖ్యమైన కేబినెట్ మంత్రులతో, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశం అవుతారని వార్తలు రాగా.. ఆ తర్వాత సమావేశం రద్దు అయ్యింది. 81 మంది సభ్యులున్న ఉన్న కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 53 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం మరో 28 మంది మంత్రులను కొత్తగా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తొలిసారిగా కేబినెట్ను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులను కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడంతో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టింది. ఈ క్రమంలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వగా.. కేంద్ర కేబినెట్ బెర్తు సైతం ఖరారైనట్లు తెలుస్తోంది. అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమంత బిస్వా శర్మ కోసం తన సీఎం పదవిని వదులుకునేందుకు అంగీకరించిన మాజీ సీఎం సర్బానంద సోనోవాల్కు సైతం కేంద్ర కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది.
మాజీ కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఎల్జేపీపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పశుపతి పరాస్కు సైతం మంత్రి పదవి ఖరారైనట్లు సమాచారం. ఆయన కొత్త కుర్తా కోసం షాపింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ‘ఢిల్లీ నుంచి ఆహ్వానం అందిందా?’ అని ప్రశ్నించగా.. ‘రాజ్ కో రాజ్ రెహ్నేదో’ అని వ్యాఖ్యానించారు. అలాగే బిహార్ నుంచి సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) పార్టీ సైతం మంత్రివర్గంలో చేరే అవకాశం ఉన్నది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మొదటిసారిగా కేబినెట్లో మార్పులు చేస్తున్నది. ఈ సందర్భంగా మంత్రుల పనితీరుపై నెల రోజుల పాటు సమీక్షించారు. ముఖ్యంగా ఏప్రిల్, మేలో కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులకు అదనపు శాఖల్లో కోతలు విధించనున్నట్లు తెలుస్తోంది. మరికొందరి మంత్రుల శాఖలు సైతం మార్చే సూచనలున్నట్లు సమాచారం.