మిరుదొడ్డి, జనవరి 18 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని లక్ష్మీనగర్ చిన్న పల్లె.. ఆ గ్రామానికి చెందిన లింగపేట రాములు, చంద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమారై ఉన్నారు. లింగంపేట రాములు 15 ఏండ్ల నుంచి గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికుడిగా (మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ) పనిచేస్తూ ముగ్గురు పిల్లలను చదివిపిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పెద్ద కుమారుడు లింగపేట నర్సింహులు చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అధిక మార్కులు పొంది తరగతుల్లో మొదటి ర్యాంకు సాధించి ఉపాధ్యాయులు, లెక్చరర్ల చేత శభాష్ అనిపించుకున్నాడు.
లక్ష్మీనగర్ నుంచి హైదరాబాద్ వరకు …
లింగపేట నర్సింహులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు(1990 నుంచి 1995 వరకు) లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. మిరుదొడ్డిలోని జడ్పీహెచ్ఎస్లో 1998 నుంచి 2002 వరకు ఆరు నుంచి పదోతరగతి వరకు అభ్యసించాడు. మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2002 నుంచి 2004 వరకు ఇంటర్మీడియట్ (సీఈసీ గ్రూపు) పూర్తిచేశాడు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2004 నుంచి 2007 వరకు బీఏ (హెచ్ఈసీ) పూర్తిచేశాడు. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో 2007 నుంచి 2009 వరకు అర్థశాస్త్రంలో పీజీ చదివాడు. 2009 నుంచి 2010 వరకు ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీ కళాశాల ఎడ్యుకేషన్లో బీఈడీ పూర్తిచేశాడు, 2011లో యూజీసీ నెట్ (అర్థశాస్త్రంలో), 2017లో టీఎస్ సెట్ (అర్థశాస్త్రం)లో అర్హత సాధించాడు. 2020లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2013 నుంచి 2015 వరకు ఐసీఎస్ఎస్ఆర్ డాక్టరేట్ ఫెలోషిప్, 2015 నుంచి 2018 వరకు యూజీసీ నాన్నెట్ ఫెలోపిప్ అందుకున్నాడు.
అర్థశాస్త్రంలో డాక్టరేట్..
చిన్నప్పటి నుంచి పట్టుదలతో విద్యను అభ్యసిస్తూనే పరిశోధనలపై లింగపేట నర్సింహులు మక్కువ పెంచుకున్నాడు. పీహెచ్డీలో చేరి ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలో అర్థశాస్త్రం విభాగంలో ‘Impact of Irrigation on Agriculture Productivity A case Study of Medak District in Telangana State’ అనే అంశం పై పరిశోధన చేసి థీసెస్ సమర్పించాడు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ అర్థశాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించింది. 2021 నవంబర్ 27న హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. డాక్టరేట్ పట్టా అందుకున్న లింగపేట నర్సింహులును గ్రామస్తులతో పాటు మండల ప్రజలు, విద్యావంతులు అభిందించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రస్తుతం లింగపేట నర్సింహులు పీజీటీ (కాంట్రాక్ట్)గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆనందంగా ఉంది..
మా తల్లిదండ్రులు లింగపేట చంద్రమ్మ, రాములు ఎన్నో ఏండ్లుగా పడిన కష్టాలకు నేడు ఫలితం దక్కింది. అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉంది. గ్రామాల్లోని విద్యార్థులు చిన్ననాటి నుంచి విద్యను అశ్రద్ధ చేయవద్దు. కష్టపడి విద్యనభ్యసిస్తే ఫలితం అదే దక్కుతుంది.
-లింగపేట నర్సింహులు, లక్ష్మీనగర్, మండలం మిరుదొడ్డి