సిద్దిపేట టౌన్, అక్టోబర్ 26 : గంజాయి రవాణాపై సిద్దిపేట పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో గంజాయి రవాణా, విక్రయాలు, సాగు నియంత్రణకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. గంజాయి రహిత జిల్లాయే లక్ష్యంగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు.
సిద్దిపేట జిల్లా అన్నింటా ఆదర్శం.. మంచిని పెంచు చెడును నిర్మూలించు అనే నినాదంతో ముందు నుంచి ఆచరిస్తూ అమలు పర్చుతున్నది. గుడుంబా రహిత జిల్లాగా మారింది. కొత్తగా గంజాయి మత్తుకు యువత చిత్తవుతున్నది. దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసుశాఖ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచించి, పక్కాగా అమలు పర్చుతున్నది. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్ శాఖతో కలిసి సమన్వయంతో ముం దుకు వెళ్తున్నది. గంజాయిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది.
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు
గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. మూలాలు పసిగట్టి వాటిని ఆదిలోనే తుంచేసేలా ముందుకెళ్తున్నది. క్షేత్రస్థాయిలో దాడులు చేస్తూ అనుమానం వచ్చిన వారిని విచారిస్తూ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఈ బృందం పనిచేస్తున్నది. ఇప్పటికే గం జాయి రవాణా ఎక్కడి నుంచి జరుగుతుందో ప్రాథమికంగా గుర్తించింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు ఇక్కడి యువతకు రుద్దారు. గంజాయికి యువత బానిసైనట్లు తెలుస్తున్నది. గంజాయి హైదరాబాద్ ధూల్పేట కేంద్రంగా రవాణా అవుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎక్కువగా ఎండు గం జాయి రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు.
పోలీసుల దాడుల్లో రెండు కిలోల 500 గ్రాముల గంజాయి స్వాధీనం
గంజాయి నిర్మూలనకు పోలీసులు జిల్లా వ్యా ప్తంగా నిఘా ముమ్మరం చేశారు. గంజాయి రహిత జిల్లాగా రూపొందించడం లక్ష్యంగా గంజాయి రవాణా జరుగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇప్ప టి వరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు 7 కేసులు నమోదు చేసి సుమారు 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ చేర్యాల మండలం అర్జునపట్ల 500 గ్రాముల గంజాయి, సంగాపూర్లో 150 గ్రాముల గంజాయి, నాగిరెడ్డిపల్లిలో 42 గంజాయి సాగు మొక్కలను ధ్వంసం చేశారు. సుమారు రెండు కిలోల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గం జాయి సాగుపై వీరు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
సమాచారం ఇచ్చే వారికి నగదు పురస్కారం
సిద్దిపేట జిల్లాలో శతశాతం గంజాయి నియంత్రించేందుకు పోలీసులు నెల రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు. శాశ్వతంగా గంజాయి నియంత్రించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అం దులో భాగంగా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, సాగు పై సమాచారం ఇచ్చే వారికి నగదు పురస్కారం అందివ్వనున్నారు.
పీడీ యాక్టు నమోదు చేస్తాం
గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం. పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక బృం దాలు ఏర్పాటు చేశాం. గంజాయి రవాణా మూలాలను కనుగొని నిర్మూలిస్తాం. యువత కదలికలపై కన్నేసి ఉంచాలి. చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఉంది. గంజాయి నిర్మూలనకు ప్రజల భాగస్వా మ్యం కోరుతున్నాం. గంజాయి రవాణా, విక్రయాలు, సాగు చేస్తున్న వారి సమాచారం తెలిస్తే కమిషనరేట్ వాట్సాప్ 7901100100 నంబరుకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నగదు పురస్కారం అంద జేస్తాం. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కలిసి రావాలి.
-జోయల్ డెవిస్, సీపీ సిద్దిపేట
ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశాం
గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ రెండు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసింది. గంజా యి, రవాణా, విక్రయాలు, సాగుపై ఈ టీమ్లు ప్రత్యేకంగా సంచరిస్తాయి. గంజాయి రవాణాకు పాల్పడే వారిని గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ 3 కేసులు నమోదు చేసి 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి సాగు చేసే వారిపై కేసు నమోదు చేశాం. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాం. గంజాయి విక్రయించే వారిపై ఎన్డీపీఎస్ ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. గంజాయి రవాణా చేస్తున్నట్లు నిర్దారణ అయితే సుమారుగా 3 నుంచి 10 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే 944090 2742కు సమాచారం ఇవ్వాలి.
గంజాయి నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
సిద్దిపేటను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
పోలీసు అధికారుల సమీక్షలో సీపీ జోయల్ డెవిస్
సిద్దిపేట టౌన్, అక్టోబర్ 26 : తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిన రాష్ట్రమని యువత చెడు వ్యసనాల బారిన పడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ పిలుపునిచ్చారు. గంజాయి రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్య ఆవశ్యకతపై విపంచి కళానిలయంలో మంగళవారం డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజా యి రవాణా ప్రదేశాలను గుర్తించాలన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలతో పాటు పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేసిందన్నారు. యువత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. గంజాయిని సమూలంగా నిర్మూలించాలని ఆదేశించారు. గంజాయి తీసుకునే వారు నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, వాటిని నియంత్రించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు గ్రామాలను రెండు సార్లు సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా లాడ్జిలు, బస్టాండ్లు, కాలేజీలు, లైబ్రరీలు తదితర వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పోలీసు శాఖ గంజాయి రవాణపై ఉక్కు పాదం మోపుతుందని, నెల రోజుల్లోనే గంజాయి రహిత జిల్లాగా మార్చుకోవడం ముందున్న లక్ష్యమన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు రాష్ట్రస్థాయిలో రివార్డు, తగిన పారితోషకాన్ని అందిస్తామన్నారు. గంజాయి రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ దేవారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పరశురామ్గౌడ్, సురేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్, ట్రాఫిక్ ఆర్ఐ శ్రీధర్రెడ్డి, ఎస్సైలు, మహిళా సిబ్బంది, శిక్షణ పొందుతున్న ఎస్సైలు, హోంగార్డులు పాల్గొన్నారు.