చాంపియన్ నిజామాబాద్.. రెండో స్థానంలో సిద్దిపేట, మూడో స్థానంలో హైదరాబాద్ జట్టు
సిద్దిపేట, నవంబర్ 25 : క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతున్నదని, అనంతపురంలో జరిగే జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో మహిళల జట్టు గోల్డ్మెడల్ సాధించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో 8వ తెలంగాణ అంతర్ జిల్లా మహిళల సాఫ్ట్బాల్ పోటీల విజేతలకు రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శోభన్బాబు, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నేతి కైలాసం, రేణుకతో కలిసి గురువారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. క్రీడాకారులు మరింత పట్టుదలతో కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. చదువుతో పాటు క్రీడలు ప్రతి ఒక్కరికీ అవసరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్బాల్ క్రీడను మారుమూల గ్రామాలకు చేర్చిందన్నారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన జట్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్, శ్యామ్సుందర్, గంగమోహన్, పెటా టిస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్, పీఈటీలు హరికిషన్, కనకారెడ్డి, గన్నె భరత్, సువర్ణలత, శిరీష, ప్రశాంత్, రాధిక, రాజ్మోహన్ గౌడ్, మహేశ్, సతీశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా సాగిన మ్యాచ్లు..
మూడోరోజూ గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సిద్దిపేటపై నిజామాబాద్ జట్టు విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మహబూబాబాద్పై నిజామాబాద్ జట్టు, రెండో క్వార్టర్లో మహబూబ్నగర్పై మేడ్చల్ జట్టు, మూడో క్వార్టర్ ఫైనల్లో వరంగల్ అర్బన్ జట్టుపై సిద్దిపేట జట్టు, కామారెడ్డిపై హైదరాబాద్ జట్టు విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాయి. సెమీఫైనల్లో సిద్దిపేట జట్టు హైదరాబాద్పై విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్లో నిజమాబాద్ జట్టు మహబూబ్నగర్పై గెలుపొంది ఫైనల్కు చేరాయి.