కాలం కలిసి రావడంతో వానకాలంలో భూమికి బరువైతది అన్నంతలా రైతులు వరి పండించారు. ఎటుచూసినా పచ్చని వరిపైర్లు కనిపిస్తున్నాయి. కాగా, వరికోతలు ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం రాసులతో పంట పొలాలు కళకళ లాడుతున్నాయి. ధాన్యం ఆరబోయడం…తాలు పట్టడం తదితర పనులు రైతుకూలీలు చేపడుతున్నారు. వానకాలం వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులకు రంది లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి భరోసా లభించడంతో ఉత్సాహంగా వరికోతల్లో రైతులు నిమగ్నమయ్యారు. రైతు ముంగిట గ్రామాల్లోనే ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పనుల్లో యంత్రాంగం బిజీగా మారింది. ఇప్పటికే మెదక్ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మద్దతు ధరతో చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
సిద్దిపేట, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం పంట చేతికందడంతో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఎక్కడి చూసినా ధాన్యం రాసులతో పంట పొలాలు కళకళలాడుతున్నాయి. అన్నదాతలు ధాన్యాన్ని ఆరబోయడం, తాలు పట్టడం తదితర పనులు చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ వానకాలం వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే రైతుల ముంగిటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు మిషన్ల ద్వారా వరి కోతలను ప్రారంభించారు. పుష్కలంగా సాగు నీరు అందడంతో గతంలో ఎప్పుడూ లేనంతగా వరిసాగు అంచనాలకు మించి జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో 13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు గానూ 875 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ గ్రేడు ధాన్యానికి రూ.1,960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1,940గా ప్రభు త్వం నిర్ణయించింది. ఆయా కొనుగోలు కేంద్రాలకు కావల్సిన పరికరాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు తదితర వాటిని సమకూర్చుతున్నారు. ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,55,600 మంది రైతులు 15,75,904 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో వరి సాగు 3,16,545 ఎకరాల్లో 1,78,812 మంది రైతులు సాగు చేయగా, 6,68,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా జిల్లాలో 405 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 224, సొసైటీల ద్వారా 169, ఏఎంసీ ద్వారా 8, మెప్మా ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో 1,12,138 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇందుకు గానూ 1,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఈ జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో డీసీఎంఎస్ ద్వారా 12, పీఏసీఎస్ ద్వారా 52, మహిళా సంఘాల ద్వారా 79 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాలో 2,56,207 ఎకరాల్లో వరిసాగు వేశారు. ఇందుకు గానూ 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి, 327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 102, పీఏసీఎస్ ద్వారా 221, ఏఎంసీ ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు.
వరి కోత మిషన్లకు భలే గిరాకీ..
జిల్లా వ్యాప్తంగా వరి కోత మిషన్లకు గిరాకీ ఉన్నది. ఈసారి గతంలో ఎప్పడూ లేనంతగా వర్షాలు పడడంతో పంట పొలాల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. దీంతో వరి కోతలు రైతులకు కత్తి మీద సాములా తయారైంది. ఎక్కువ శాతం వరి కోతలను నీళ్లలో నడిచే యంత్రాల ద్వారానే కోస్తున్నారు. ఈ మిషన్లకు గ్రామాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నది. నీటిలో వరి కోతలు కోసే మిషన్కు గంటకు రూ.3,000 నుంచి రూ.3,600, నీళ్లు లేని పొలాల్లో గంటకు రూ.2,200 నుంచి రూ.2,500 తీసుకుంటున్నారని రైతులు తెలుపుతున్నారు. స్థానికంగా ఉన్న మిషన్లతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి మిషన్లను తీసుకువచ్చి వరి కోతలు కోపిస్తున్నారు. నెల, రెండు నెలల పాటు మిషన్లను ఇక్కడికి తీసుకువచ్చి స్థానికంగా ఉన్న వాళ్లు వీటిని నడిపిస్తున్నారు. వీరికి గంటకు కొంత కమీషన్ రూపంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన మిషన్ యజమానులు ఇస్తారు.
నీళ్లు, వరి పంటలు పుష్కలం..
నీళ్లు పుష్కలంగా ఉండటంతో వరిని బాగా సాగు చేసిండ్రు. రైతులందరికీ పుట్ల కొద్ది వడ్లు పండుతున్నయ్. అప్పుడు వరికోత మిషన్లుకు డిమాండ్ ఉండేది, దొరికేది కాదు. కానీ, ఇప్పుడు మా ఊళ్లోనే (అక్కన్నపేట గ్రామ పంచాయతీ) సుమారు 50 వరకు వరికోత మిషన్లు ఉన్నాయ్. ఇందులో పది వరకు బురద, నీళ్లల్ల వరిని కోసే మిషన్లు అందుబాటులో ఉన్నయ్. వరి కోతలు కూడా ఊపందుకున్నాయ్. – భూక్య బాపునాయక్, రైతు. బోదర్వాగుతండా(అక్కన్నపేట)
20 రోజులు కరెంటు మోటర్ పెట్టలేదు..
ఎనుకట నీళ్లు లేక అరిగోస పడేది. నీళ్లుంటేనే ఎవుసం అందం, లేకపోతే చేసి ఫయిదా లేదు అనిపించింది. ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే, చెరువులు, కుంటలన్నీ నిండి మత్తడ్లు పోసినై. భూమి మీద వరిచేన్లు పచ్చగా ఉన్నయ్. మొన్నటి వానలకు 20 రోజులు కరెంటు మోటర్ పెట్టలేదు. అయినా పొలంల నీళ్లు ఉన్నయ్. వరి కోతలు మస్త్ నడుస్తున్నయ్.